సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): సమాజానికి కళ్లూ, చెవులుగా వ్యవహరించే జర్నలిస్టులు నేడు అనేక సమస్యల మధ్య పని చేస్తున్నారని, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరంచడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరైంది కాదని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం.గిరి పేర్కొన్నారు. గురువారం టీజేయూ నూతన కమిటీ జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా గిరి మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు తగిన శ్రద్ధ చూపడంలో విఫలమవుతున్నాయని తెలిపారు. రాష్ట ప్రభుత్వo ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేది జర్నలిస్టులేనన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్థంభంగా గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధుల సమస్యలు పరిష్కారమైతేనే పారదర్శక, బాధ్యతాయుత పాలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ (టీజేయూ) సంగారెడ్డి జిల్లా కమిటీ జర్నలిస్టుల సమస్యలపై తక్షణ జోక్యం చేసి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, ప్రజా సమస్యలు, పాలనలోని లోపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడం విచారకరమని అన్నారు. ప్రభుత్వ అధికారుల పని తీరును నిత్యం ప్రజలకు తెలియజేస్తున్నామని, జర్నలిస్టులు భద్రతా లోపం, ఆర్థిక అస్థిరత, ఆరోగ్య సమస్యలు, ప్రభుత్వ అధికారుల సహకారం లభించడం లేదన్నారు. జర్నలిస్ట్ సమస్యల లేమితో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న జర్నలిస్టులకు ఈ సమస్యలు మరింత తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రెస్ క్లబ్ ఉన్నా.. జర్నలిస్టలకు ప్రయోజనo లేదన్నారు. గడిచిన 20 ఏండ్ల నుంచి ఏ ఒక్క జర్నలిస్టుకు ఉపయోగ పడలేదన్నారు. వెంటనే జర్నలిస్టులకు ఉపయోగ పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ఒకే వర్గం ఆధిపత్యంలో ఉండటం సరి కాదన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. జర్నలిస్టులకు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు, జర్నలిస్టు గుర్తింపు కార్డులు, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, నివాస స్థలాల కేటాయింపు, వెంటనే కల్పించాలని అన్నారు. నూతన అక్రెడిటేషన్ కార్డుల జారీ వంటి కీలక డిమాండ్లను ప్రస్తావించారు. నూతన అక్రెడిటేషన్ కార్డుల జారీ విషయంలో ప్రెస్ క్లబ్ చైర్మన్ సమర్థంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని, వెంటనే తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అక్రిడేషన్ కమిటీలో టీజేయూ యూనియన్ అవకాశం కల్పించాలన్నారు. జర్నలిస్టుల సమస్యలు కేవలం సంక్షేమ సదుపాయాలకు మాత్రమే పరిమితం కాకుండా, వారి వృత్తి గౌరవం, ఆత్మగౌరవానికి సంబంధించినవని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగితే అది పరోక్షంగా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపుతుందని తెలిపారు. స్వేచ్ఛాయుతంగా, నిర్భయంగా వార్తలు రాయాలంటే వృత్తి భద్రత అత్యంత కీలకమని పేర్కొన్నారు. అందుకే జిల్లా యంత్రాంగం ఈ వినతిని సానుకూలంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంగారెడ్డి జిల్లా టీజేయూ కమిటీ జర్నలిస్టుల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయని, ప్రజల తరఫున నిలబడే జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు నిజంగా ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవడానికి, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు పోచగౌడ్ మహేష్ గౌడ్, కార్యదర్శి జావీద్ రాజేష్, శివ కుమార్ కార్యవర్గ సభ్యులు గణేష్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యలు పరిష్కారించాలి: టీజేయూ జిల్లా అధ్యక్షుడు ఎం.గిరి
Updated On: December 18, 2025 8:24 pm