మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ 26 నుంచి మే 02 వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 318 మంది వాహనదారులు పట్టుబడ్డారు.
పట్టుబడిన వారిలో 271 మంది ద్విచక్ర వాహనదారులు, 37 మంది కార్ డ్రైవర్లు, 10 మంది ఆటో డ్రైవర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఐదుగురు వ్యక్తులు 300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ, 18 మంది 200 మిల్లీగ్రాములకుపైగా బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ (బీఏసీ)తో పట్టుబడినట్లు తెలిపారు.
మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీ కె. రాహుల్ రెడ్డి, ఐపీఎస్ మాట్లాడుతూ, మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 105 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.
గత వారం కోర్టు ముందు హాజరుపరిచిన కేసుల్లో 17 మందికి జైలు శిక్ష విధించగా, 18 మందికి జరిమానాతో పాటు సామాజిక సేవ చేయాలని న్యాయస్థానం ఆదేశించినట్లు వెల్లడించారు. మరో 247 మందికి భారీ జరిమానాలు విధించినట్లు తెలిపారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని డీసీపీ స్పష్టం చేశారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.











