పోలీస్ అమరవీరుల స్మరణార్థం సైకిల్ ర్యాలీ ఘనంగా
– 8.2 కిలోమీటర్ల దూరం సైకిల్ ర్యాలీతో అమరవీరులకు జోహార్లు
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 24
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కామారెడ్డి పట్టణంలో శనివారం ఉదయం భారీ ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 8.2 కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీ లో సుమారు 300 సైకిళ్లు పాల్గొన్నాయి.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్. స్వయంగా సైకిల్పై పయనమై ర్యాలీని ప్రారంభించి పూర్తి చేయడం ద్వారా సిబ్బందికి ఆదర్శప్రాయంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కే. నరసింహ రెడ్డి, ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్., బాన్సువాడ డీఎస్పీ బి. విట్టల్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.
ర్యాలీ పొందుర్తి స్వాగత తోరణం వద్ద ప్రారంభమై జి.ఆర్. కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నిజాంసాగర్ చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, బస్టాండ్, సరస్వతి శిశు మందిర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గుండా సాగి కళాభారతి వద్ద ముగిసింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ – “పోలీసు అమరవీరులు చేసిన త్యాగాలు అమూల్యమైనవి. వారు ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించారు. వారి స్ఫూర్తి ప్రతీ ఒక్కరికీ ఆదర్శం కావాలి” అన్నారు. ప్రజలతో పోలీసుల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కావడానికే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ర్యాలీ విజయవంతంగా నిర్వహించిన సిబ్బంది, పాల్గొన్న విద్యార్థులు, యువతకు జిల్లా ఎస్పీ అభినందనలు తెలిపారు.