తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి టాటా లాక్హీడ్ మార్టిన్ ఎయిరోస్ట్రక్చర్స్ సంస్థ ఆసక్తి చూపుతోంది. సంస్థ సీఓఓ, మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రైఫిల్ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశంలో, భారతదేశంలో లాక్హీడ్ మార్టిన్ సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన తాజా పరిణామాలు, ముఖ్యంగా C-130J సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్ను భారతదేశంలో ఏర్పాటు చేసేందుకు సంస్థ చేస్తున్న ప్రయత్నాల గురించి చర్చించారు.
అంతర్జాతీయ అవసరాల కోసం భారతదేశంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో కలిసి F-16 వింగ్స్ను సంయుక్తంగా ఉత్పత్తి చేసేందుకు లాక్హీడ్ మార్టిన్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది.
రక్షణ రంగంలో విమానాల నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్హాల్ (MRO) సదుపాయాలతో పాటు ఇతర డిఫెన్స్ హబ్గా తెలంగాణ విస్తరిస్తున్న నేపథ్యంలో, ఇక్కడ పెట్టుబడులకు గల అవకాశాలను అన్వేషించాలని టిమ్ రైఫిల్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ సమావేశం తెలంగాణ రాష్ట్రంలో రక్షణ రంగంలో మరింత అభివృద్ధికి, పెట్టుబడులకు దోహదపడుతుందని భావిస్తున్నారు.










