నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య బుధవారం బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ జామ మసీద్లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజాన్ మాసం యొక్క విశిష్టతను, దానిలోని విలువలను ఆయన వివరించారు.
బోధన్ పట్టణంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు గుల్షన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఇఫ్తార్ విందు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా సాగింది. ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముక్తి జావేద్ నిర్వహించిన దువాలో పాల్గొని, అనంతరం ఉపవాస విరమణ చేశారు.
రంజాన్ మాసం కేవలం ఉపవాసాలకే పరిమితం కాదని, ఇది మనస్సును పరిశుభ్రం చేసుకునే ఆత్మపరిశీలన కాలమని సీపీ తన ప్రసంగంలో తెలిపారు. ఉపవాసం ద్వారా క్రమశిక్షణ, సహనం, నియమం పెంపొందుతాయని, పేదల పట్ల కరుణ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ పవిత్ర మాసంలో దానధర్మాలు, సహనశీలత, సోదరభావం వంటి విలువలు మరింతగా వెలుగులోకి వస్తాయని సీపీ అన్నారు. అల్లా కృపతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
అంతేకాకుండా, అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి, బోధన్కు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐలు, ఎస్సై, మజీద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

