స్థానిక కాలనీల్లో తీవ్రంగా మారిన మురుగునీటి పారుదల సమస్యలను పరిశీలించేందుకు కాంగ్రెస్ యువ నాయకుడు జీవన్ రెడ్డి, మున్సిపల్ ఏఈ రవికిరణ్తో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. శివశంకర్ నగర్, వెంకటేశ్వర కాలనీ, రామకృష్ణ నగర్, దివ్యసాయి గార్డెన్స్ ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి, అక్కడి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పర్యటన సందర్భంగా, మురుగునీరు రోడ్లపైకి రావడం, డ్రైనేజీలు పొంగిపొర్లడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానికులు జీవన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. మురుగునీటి కారణంగా దుర్వాసన వ్యాపిస్తోందని, పిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి గల్లీని పరిశీలించిన జీవన్ రెడ్డి, సమస్య తీవ్రతను మున్సిపల్ ఏఈ రవికిరణ్కు వివరిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపాలని అధికారులను కోరారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, డ్రైనేజీ సమస్యను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తాత్కాలిక మరమ్మతులతో కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని, అవసరమైన నిధులు మంజూరు చేయించి, యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
స్థానిక సమస్యలపై స్పందిస్తూ, అధికారులతో కలిసి బస్తీల్లో పర్యటించడం పట్ల కాలనీ వాసులు జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ అధ్యక్షులు, యువజన సంఘాల ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.











