అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (DJFT) ఆధ్వర్యంలో శుక్రవారం మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐ అండ్ పి ఆర్ కమిషనర్ ప్రియాంక, అక్రెడిటేషన్ కమిటీ సభ్యులకు వినతిపత్రం అందజేశారు.
DJFT రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జ్యోతిబసు, ఎస్కే మస్తాన్ మాట్లాడుతూ, అక్రెడిటేషన్ల విషయంలో డెస్క్ జర్నలిస్టులతో పాటు రిపోర్టర్లు, వెబ్, టీవీ, కేబుల్ ఛానళ్లలో పనిచేసే జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం, ప్రతి ఎడిషన్కు కేవలం నాలుగు డెస్క్ జర్నలిస్టులకు మాత్రమే అక్రెడిటేషన్లు ఇస్తామని నిబంధన ఉందని, ఇది చాలా మందికి కార్డులు అందకుండా చేస్తోందని తెలిపారు.
వెబ్, టీవీ, కేబుల్ జర్నలిస్టులకు కూడా తగినన్ని అక్రెడిటేషన్ కార్డులు లభించడం లేదని వారు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అర్హులైన డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు వస్తాయని హామీ ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు.
ఆయా పత్రికల యాజమాన్యాలు ఇప్పటికే అర్హులైన డెస్క్ జర్నలిస్టుల జాబితాను ఐ అండ్ పి ఆర్, డిపిఆర్ఓలకు అందజేసినట్లు వారు చెప్పారు. ఈ జాబితాను పరిగణనలోకి తీసుకుని, అక్రెడిటేషన్ల సంఖ్యను తగ్గించకుండా, సర్క్యులేషన్తో సంబంధం లేకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.











