రాబోయే వారం రోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఈ మేరకు కసరత్తు చేస్తోంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ నెల 16వ తేదీన మీడియా సమావేశం నిర్వహించి, ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ ప్రకటనతో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగనుంది.
ఈ ఐదు రాష్ట్రాల్లోని ప్రస్తుత అసెంబ్లీల పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో, ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను సమీక్షిస్తోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలకు తుది ఓటర్ల జాబితాలను ప్రకటించింది.
బెంగాల్కు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను కూడా నేడో, రేపో విడుదల చేసే అవకాశం ఉంది. ఓటర్ల జాబితాల ఖరారుతో పాటు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఇతర ఏర్పాట్లపై కూడా ఎన్నికల సంఘం దృష్టి సారించింది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది కేటాయింపు వంటి అంశాలపై అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు.

