కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడిపై వచ్చిన ఆరోపణలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, దీనిని తనను అప్రతిష్టపాలు చేయడానికి జరుగుతున్న రాజకీయ కుట్రగా అభివర్ణించారు.
తన ప్రజా జీవితంలో ఎల్లప్పుడూ చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించానని, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. తనయుడిపై వచ్చిన నిరాధారమైన ఆరోపణలను ఆయన ఖండించారు.
పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయ పోరాటాల్లోకి లాగడం అనేది, రాజకీయంగా తనతో పోరాడే ధైర్యం లేని వారి నిస్సహాయతను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. తాను కఠోర శ్రమ, ప్రజా మద్దతుతో ఎదిగానని, తన ఎదుగుదలను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో, తనను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయడానికి ఈ రాజకీయ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ఇది ఒక రాజకీయ కుట్ర అని ఆయన స్పష్టం చేశారు.
ఏది సరైనదో, ఏది తప్పో న్యాయవ్యవస్థ నిర్ణయిస్తుందని, కాలమే ప్రతి ఆరోపణకు, కుట్రకు సమాధానం చెబుతుందని బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సత్యమేవ జయతే అని ఆయన తన ప్రకటనను ముగించారు.











