అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను పారదర్శకంగా జారీ చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి కోరారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్కు యూనియన్ తరపున వినతి పత్రం సమర్పించారు.
గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో బింగి స్వామి మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లాలో గతంలో అక్రిడేషన్ కార్డుల జారీలో అవకతవకలు జరిగాయని, జర్నలిస్టులు కాని వారికి కూడా కార్డులు ఇచ్చారని ఆరోపించారు. ఆటో డ్రైవర్లు, ప్రజాప్రతినిధులు, కార్మికులు, ఉద్యోగులకు కూడా కార్డులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
ఈ ఏడాది అక్రిడేషన్ కార్డుల జారీలో ఇలాంటి అవకతవకలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు. నిజమైన, అర్హత కలిగిన జర్నలిస్టులను గుర్తించి, యూనియన్లతో సంబంధం లేకుండా నిష్పాక్షికంగా కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
అర్హులైన జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా పారదర్శక విధానాలను అమలు చేయాలని అధికారులను కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని యూనియన్ విజ్ఞప్తి చేసింది.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం.గిరి, రమేష్ గౌడ్, శ్రీనివాస్, మహేష్ గౌడ్, పోచాగౌడ్, జావీద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.












