నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.

విశాఖపట్నం: నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర భారతం మీదుగా వెళ్తున్న పశ్చిమద్రోణి.. అల్పపీడనాన్ని, తేమను తనవైపు లాగడానికి ప్రయత్నిస్తోంది. తీవ్ర అల్పపీడనం పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ బుధవారానికి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దానికి అనుబంధంగా 4.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. బుధవారం ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది. పిడుగులు పడే అవకాశముందని వెల్లడించింది. బుధవారం మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. శనివారం తర్వాత రాష్ట్రంలో వర్షాలు తగ్గుతాయి. మంగళవారం అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ఏలూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం తదితర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. చలిగాలులు వీచాయి. అల్పపీడనం తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉండడంతో తీరప్రాంత జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కళింగపట్నం, విశాఖపట్నం, తుని, కాకినాడ, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 7 డిగ్రీల మేర తగ్గాయి.

Join WhatsApp

Join Now