మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఉపాధిహామి, ఇందిరమ్మ అమృత భరోసా పధకాలను అమలు చేయాలి
* ఆర్డీఓ కార్యాలయం ఎదుట డిబిఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
* నిర్వాసితుల బాధలపై ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉదృతం చెస్తాం
* డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్
* గజ్వేల్ ఆర్డీవో చంద్రకళకు వినతి పత్రం అందజేత
మల్లన్న సాగర్ భూనిర్వాసితులకు, ఉపాధిహామి పథకం పనులు చూపించాలని, ఇందిరమ్మ అమృత భరోసా పధకాన్ని వర్తింప చేయాలని, అర్అండ్ఆర్ ప్యాకేజిని అమలు చేయాలని, అన్ని గ్రామాలకు స్మశాన వాటికలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో గురువారం గజ్వేల్ ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అర్డిఓ చంద్రకళకు వినతిపత్రం అందజేశారు. సమస్యలపై చర్చించి పనికి దరఖాస్తులు ఇచ్చారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ మల్లన్న సాగర్ భూనిర్వాసితులకు భూసేకరణ చట్టం 2013 చట్టం ప్రకారం ఆర్అండ్ఆర్ ప్యాకేజి అందని కుటుంబాలకు అందివ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు 600 మందికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చెయలేదన్నారు. దాదాపు 800 మంది ఒంటరి మహిళలకు ఆర్ అండ్ఆర్ ప్యాకేజి అమలు చేయకుండా గత, ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. వెయ్యి మంది నిర్వాసితులకు ప్లాట్లను కేటాయుంచలేదని, 400 మందికి ప్లాట్లకు పొజిషన్ చూపించలేదన్నారు. మరో 400 ఎకరాలకు నష్టపరిహరం నేటికి అందించలేదన్నారు. 18 సంవత్సరాలు నిండిన కొంత మంది వయోజనులకు సైతం ఆర్అండ్ఆర్ ప్యాకేజిని అమలుచేయలేదన్నారు. 123 జిఓ ప్రకారం బలవంతంగా భూములు స్వాధీనం చెసుకున్నప్పటికి రైతులకు రుణమాపి అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం స్పందించకుంటె ఉద్యమాన్ని ఉధృతం చెస్తామని హెచ్చరించారు.
ఎర్రవళ్ళి పంచాయతీ కార్యదర్శికి పనికి దరఖాస్తు, ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా అనంతరం నిర్వాసిత కాలనీలోని ఎర్రవల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వామికి డిబిఎఫ్ అధ్వర్యంలో 91 మంది కూలీల సంతకాలతో పనికి దరఖాస్తులు సమర్పించారు. జాబ్ కార్డులు మా వద్ద మా పనులు ఎక్కడ, పనులు కల్పించాలని, ఇందిరమ్మ అమృత భరోసా పధకం కింది నిర్వాసితులకు 12 వేల ఆర్ధిక సహాయం అందించాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజి అమలు చేయాలని నినాదాలు చేశారు. గ్రామీణ ఉపాధిహామి పథకం కింద ఏర్రవళ్ళి, సింగారం, వేములఘట్, ఏటిగడ్డ కిష్టాపూర్, కిష్టాపూర్ తండా, పల్లె పహడ్, నగరం, నగరం తండా, రాంపూర్, లక్ష్మాపూర్, బాపన్ బంజేరుపల్లి గ్రామాలకు చెందిన భూనిర్వాసితులైన కూలీలకు జాబ్ కార్డులు ఉన్నప్పటికి గత ఐదు సంవత్సరాలుగా పనులు చూపించకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారన్నారు. వేరు వేరు మండలాలకు, భవన నిర్మాణ పనులకు గజ్వేల్ అడ్డాకు వెళ్ళి పనులు దొరకక అర్థాకాలితో అలుమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధిహామీ కూలీలకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాలకు స్మశాన వాటికలు నిర్మించాలని కోరారు. నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే త్వరలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాకు డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు నిర్వాసితులు పాల్గొన్నారు.