నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్-5 పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజలకు స్నేహపూర్వక సేవలు అందించాలని, కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.
స్టేషన్కు చేరుకున్న కమిషనర్కు అధికారులు, సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్టేషన్లోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన, భద్రతా పరికరాలు, ఆయుధాల నిర్వహణ, రికార్డుల సంరక్షణ వంటి అంశాలపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. రిసెప్షన్ కేంద్రాన్ని సందర్శించి, ఫిర్యాదుల నమోదు విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. ప్రతి ఫిర్యాదుదారుని గౌరవంతో స్వాగతించి, వారి సమస్యలను ఓర్పుతో విని తక్షణమే స్పందించాలని ఆదేశించారు.
కేసుల నమోదు, పెండింగ్ దర్యాప్తులు, బీట్ డ్యూటీ వ్యవస్థ, రౌడీషీటర్లపై నిఘా వంటి అంశాలపై సమగ్రంగా తనిఖీ చేసిన కమిషనర్, కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, వృద్ధులు, అత్యవసర సహాయం కోసం వచ్చే వారి సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
“5ఎస్ విధానం” అమలు తీరును సమీక్షించిన ఆయన, ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, డిజిటల్ రికార్డు నిర్వహణ, సిబ్బంది హాజరు, విధి నిర్వహణ తదితర అంశాలపై ఆరా తీశారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెరిగేలా పారదర్శకంగా, క్రమశిక్షణతో సేవలు అందించాలని సూచించారు.
సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని, విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యల నివారణకు చర్యలు చేపట్టాలని, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆన్లైన్ బెట్టింగ్లు, గేమింగ్ యాప్ల మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండేలా ప్రచారం చేయాలని సూచించారు. సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.












