భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, ఒక యువకుడు 'కాక్రోచ్ జనతా పార్టీ' అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
మే 15నాడు భారత ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జగ్మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఒక కేసు విచారణ సందర్భంగా, నిరుద్యోగ యువతను 'బొద్దింకలు' (cockroaches)తో పోల్చారు. ఉద్యోగాలు లేక ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ, రైట్ టు ఇన్ఫర్మేషన్ (RTI) కార్యకర్తలుగా మారుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి.
ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదువుతున్న అభిజీత్ దీప్కే అనే యువకుడు 'కాక్రోచ్ జనతా పార్టీ'ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనకు ఊహించని రీతిలో స్పందన లభించింది. ఒక్కరోజులోనే 46,000 మంది సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. RTI కార్యకర్తలు, విద్యావేత్తలు, విద్యార్థుల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయని తెలుస్తోంది.
అభిజీత్ తన స్నేహితులతో కలిసి 'కాక్రోచ్ జనతా పార్టీ' కోసం ఒక వెబ్సైట్ను రూపొందించారు. ఈ వెబ్సైట్లో మేనిఫెస్టో, డిజైన్, అర్హతలు, సంప్రదింపుల వంటి విభాగాలు ఉన్నాయి. పార్టీ మేనిఫెస్టోలో 'రిటైర్డ్ న్యాయమూర్తులను రాజ్యసభకు పంపడాన్ని వ్యతిరేకిస్తాము' అని, అధికారంలోకి వస్తే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. ఈ పార్టీకి సోషల్ మీడియాలో కూడా భారీగా ఫాలోవర్స్ పెరిగారు.
ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కీర్తి ఆజాద్, మహువా మొయిత్ర, ప్రశాంత్ భూషణ్ వంటి ప్రముఖులు కూడా ఈ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ' కేవలం ఒక ఆన్లైన్ చర్చగా మిగిలిపోతుందా లేక నిజమైన రాజకీయాల్లోకి ప్రవేశిస్తుందా అనేది వేచి చూడాలి. ఈ నేపథ్యంలో, న్యాయమూర్తి తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని, ఫేక్ డిగ్రీలు ఉన్న వారిని ఉద్దేశించే అన్నానని వివరణ ఇచ్చారు.











