టియుడబ్ల్యూజే(ఐజేయు) (ప్రశ్న ఆయుధం) జూలై 09
(ఐజేయు) జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో గురువారం టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సభకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, టీజీఐఐసీ చైర్మన్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరవుతున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా పాల్గొంటున్నారు.
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా మహాసభను గురువారం భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే పైసల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ తెలిపారు. ఈ మహాసభకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు ఎంపీలు రఘునందన్ రావు, సురేష్ షెట్కార్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరవుతున్నారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు వివరించారు. రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ కూడా పాల్గొంటున్నారని చెప్పారు.
ప్రతి జర్నలిస్టు సంక్షేమమే లక్ష్యంగా ఈ మహాసభను జరుపుతున్నట్లు వారు తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం లక్ష్యంగా ఈ సభను నిర్వహిస్తున్నామని అన్నారు. చాలామంది అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇంకా రాలేదని, హెల్త్ కార్డు సమస్య ఇంకా పెండింగ్ లోనే ఉందని చెప్పారు. ఉద్యోగ భద్రత కూడా లేకుండా పోయిందని అన్నారు. వీటన్నిటిపై తమ సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. జర్నలిస్టుల పక్షాన అలుపెరుగకుండా పోరాడుతున్నామని వివరించారు. జిల్లాలోని పాత్రికేయుల సమస్యల పరిష్కారమే తమ యూనియన్ లక్ష్యం అని వెల్లడించారు.
అంతేకాకుండా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న మధ్య తరహా పత్రికలు, ఉర్దూ పత్రికలు, కేబుల్ టీవీ, ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు దశాబ్దాలుగా ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నారని అన్నారు. వారందరికీ ఈ మహాసభ ద్వారా భరోసా కల్పించనున్నట్లు చెప్పారు. అర్హులైన వారందరికీ ఇంటి స్థలం, హెల్త్ కార్డు, అక్రిడేషన్ కార్డులను సాధించడం జరుగుతుందన్నారు.












